Health: వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం ఆరంభంలోనే మృగశిర కార్తి మొదలవుతుంది. ఇది కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ మృగశిర కార్తె సమయంలో పూర్వకాలం నుంచి చేపలు తినడం ఒక ఆచారంగా వస్తుంది. ఈ రోజుల్లో చేపలను ఎక్కువగా తినడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మృగశిర కార్తెలో చేపలు తింటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చాలా మంది ప్రజలు బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ కారణంగా ఈ మాసంలో చేపల ధరలు కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటాయి.
అయితే మృగశిర కార్తెలో చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెప్పడానికి బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వేసవి కాలం ముగిసిన తర్వాత వర్షాకాలం ఆరంభంలోనే ఈ మృగశిర కార్తె వస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా శారీరక ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. అలాగే శరీరంలో వ్యాధి నిరోధక సామర్థ్యం కూడా కొంత క్షీణిస్తుంది. అలాగే కొన్ని అనారోగ్యాలు వర్షాకాల ఆరంభంలో వాతావరణ మార్పులు కారణంగా బయటకు వస్తాయి. ఈ కారణంగానే వర్షాకాలం ఆరంభంలో చాలామంది దగ్గు, జలుబుతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు.

శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ అనారోగ్య లక్షణాలను కూడా శరీరం మొత్తం వ్యాపించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చేపల్లో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగానే వర్షాకాల ఆరంభంలో వచ్చే మృగశిర కార్తెలో చేపలు ఎక్కువగా తినమని డాక్టర్లు సలహా ఇస్తారు. చేపలలో ఉండే కొవ్వు, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి చూపు మెరుగు పరచడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి.
అలాగే గుండెజబ్బులు ఆస్తమా మధుమేహ వ్యాధి ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చేపలు తింటే రోగనిరోధక శక్తి పెరిగి ఆ జబ్బులు బయటపడకుండా ఉంటాయి. చేపలలో ఎన్నో రకాల ప్రోటీన్స్, ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేపల వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వాతావరణ మార్పులు కారణంగా మనలో రోగ నిరోధకశక్తిని మళ్లీ పెంపొందించుకోవడానికి మృగశిర కార్తెలో చేపలు ఎక్కువగా తినమని డాక్టర్లు సూచిస్తుంటారు.