Tollywood: ఒకప్పుడు సినిమా అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఒక సామాజిక మీడియాగా ఉండేది. ఈ కారణంగా దర్శకులు ఎక్కువగా కుటుంబ నేపధ్యం ఉన్న సందేశాత్మక కథలు తెరకెక్కిస్తూ ఉండేవారు. ఇక ఆ సందేశాత్మక కథలని చూసిన ప్రేక్షకులు కూడా వాటి నుంచి స్ఫూర్తి పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే సినిమా ఎప్పుడైతే వ్యాపారంగా మారిందో కమర్షియల్ హంగులు వచ్చాయి. ప్రేక్షకుడి భావోద్వేగానికి కనెక్ట్ అయితే చాలు అని ఆలోచిస్తూ దర్శకులు సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి కమర్షియల్ జోనర్ లో వచ్చే సినిమాలకె ఎక్కువ ప్రజాదారణ ఉంటుంది. అప్పుడప్పుడు సందేశాత్మక కథలని కొంత మంది దర్శకులు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అవి ప్రేక్షకులని ఏ విధంగా కూడా కనెక్ట్ చేయడం లేదు.

ఒక వేళ కనెక్ట్ అయినా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం లేదు. ఇక సినిమాపై కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టినపుడు కమర్షియల్ గా సక్సెస్ అయితేనే మరో నాలుగు సినిమాలు నిర్మాతలు తీయగలరు. కాని డబ్బులు రాని సందేశాత్మక కథలు ఎన్ని చేసిన కూడా నిండా పోలిగిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న నిర్మాతలు అందరూ కూడా కమర్షియల్ కథల పైనే దృష్టి పెడుతున్నారు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న కచ్చితంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే ఆడియన్స్ చూస్తారు అని అర్ధమైన తర్వాత అలాంటి కథలతోనే సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఏవో జీవితం గొప్పతనం, గొప్పవాళ్ళ కథలు, ఫ్యామిలీ వేల్యూస్, వ్యక్తిత్వ వికాసం అంటూ కథలని చెబితే ప్రేక్షకుడు సంకోచం లేకుండా రిజక్ట్ చేస్తున్నాడు.

గత ఏడాది థాంక్యూ, విరాటపర్వం సినిమాలు ఆ కోవలోకి వచ్చినవే. వ్యక్తిత్వ వికాసం క్లాస్ లు వినాలనుకుంటే ఒక గంట యుట్యూబ్ ఓపెన్ చేస్తాం కాని 500 టికెట్ కొనుక్కొని థియేటర్స్ కి ఎందుకు వస్తాం అనే పంథాలో ఆడియన్స్ ఉన్నారు. ఇదే సమయంలో ప్రజల నమ్మకం, భావోద్వేగాలకి కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. కాంతారా, కార్తికేయ, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాల కథలు చూసుకుంటే దైవం అనే మనిషి నమ్మకం చుట్టూ తిరిగే కథలే. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా దేశభక్తిని పెంపొందించే కథాంశంతో వచ్చింది.

అందులో అంతర్లీనంగా సందేశం ఉన్నా కూడా కమర్షియల్ గా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉననయా, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అనేది మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. అలా ఉన్నవాటికే ఆదరణ లభిస్తుంది. జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండరీ దర్శకుడు కూడా కేవలం కమర్షియల్ సక్సెస్ కోసమే సినిమాలు చేస్తున్నాడు తప్ప ఎవరికీ సందేశం ఇవ్వడానికి కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండు గంటలు థియేటర్స్ కి వచ్చి సందేశాలు వినడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరనే విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి దర్శకులు అర్ధం చేసుకుంటే బెటర్ అనే మాట సినీ వర్గాలలో వినిపిస్తుంది.

